నైట్రేట్ కలుషిత నీటితో ప్రొస్టేట్ క్యాన్సర్.. తాజా అధ్యయనం

by Disha Web Desk 7 |
నైట్రేట్ కలుషిత నీటితో ప్రొస్టేట్ క్యాన్సర్.. తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal)‌కు చెందిన సైంటిస్టులు నైట్రేట్‌తో కలుషితమైన ట్యాప్ వాటర్ (కుళాయి నీరు) లేదా బాటిల్ వాటర్‌ను ఎక్కువ కాలం తాగే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులలో సంభవించే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఒక్క యూఎస్‌లోనే 3.1 మిలియన్లకుపైగా బాధితులు ఉన్నారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. ఈ క్రమంలో స్పెయిన్‌లో నిర్వహించిన అధ్యయనం ద్వారా నీటిలో నైట్రేట్ కలవడం వలన ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ఆధారాలు కనుగొన్నారు పరిశోధకులు. ట్రైహాలో మీథేన్ (trihalomethane) కాలుష్యం మూత్రాశయ క్యాన్సర్‌పై చూపే ప్రభావాన్ని కూడా గుర్తించారు.

నైట్రేట్ పొల్యూషన్ సోర్స్

వ్యవసాయ భూముల్లో దిగుబడిని పెంచడానికి ఉపయోగించే ఎరువులు, పశువుల పెంపకం నుంచి శుద్ధి చేయకుండా వదిలేసే ఎరువులో పెద్ద మొత్తంలో నైట్రేట్ ఉంటుంది. ఇది వర్షాకాలంలో నదులు, చెరువులు, కాలువల ద్వారా మంచినీటి జలాశయాల్లోకి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదేగాక పేలుడు పదార్థాలు, మెడిసిన్స్ తయారీ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ద్వారా కూడా నైట్రేట్ వాతావరణంలోకి చేరుతుంది. మరోవైపు ట్రైహాలో మీథేన్ (THM) కాలుష్యం అనేది క్లోరిన్ వంటి నీటి క్రిమిసంహారకాలు, నీటిలో ఇప్పటికే ఉన్న ఇతర సేంద్రీయ, అకర్బన రసాయనాల మధ్య ప్రతిచర్యల ఫలితం. ప్రాథమికంగా, ఇది నీటి క్రిమిసంహారకాలను ఉపయోగించడంవల్ల బై ప్రొడక్టుగా ఉపయోగపడుతుంది. నైట్రేట్, ట్రైహాలో మీథేన్ కలుషితమైన నీటిని తాగినప్పుడు మాత్రమే కాకుండా వ్యక్తి చర్మం ద్వారా కూడా దాని మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది. కాబట్టి స్నానం చేస్తున్నప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు, కలుషితమైన నీటిలో ఈత కొట్టేటప్పుడు కూడా మీ శరీరం THMకు గురవుతుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఎలా దారిస్తుంది?

ISGlobal టీమ్ 697 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులను 18 సంవత్సరాల వయస్సు నుంచి డ్రింకింగ్ వాటర్‌లో నైట్రేట్, THM కాలుష్యంపై అధ్యయనం చేసింది. 927 మంది ఆరోగ్యకరమైన పురుషులను కూడా విశ్లేషించి, ఈ ఫలితాలను పోల్చారు. ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులను గుర్తించిన తర్వాత వారు నివసించిన ప్రాంతాల్లోని నీటి వనరులు, పంపు నీరు, సాధారణంగా లభించే బాటిల్ వాటర్‌పై పరిశోధనలు చేశారు. ఇందుకు సంబంధించి సంబంధిత మున్సిపాలిటీలు, నీటి సరఫరాదారులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ల నుంచి డేటాను కూడా సేకరించారు. ఈ మొత్తం ప్రక్రియ ఆధారంగా కొనసాగిన పరిశోధనలో నీటిలోని నైట్రేట్ కంటెంట్ ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణం అవుతోందని తేలింది.

ప్రొస్టేట్ కణితులు

రోజుకు 14 మి.గ్రా కంటే ఎక్కువ నైట్రేట్ స్థాయిలు ఉన్న నీటిని తాగే వ్యక్తులు, 6 మి. గ్రా నైట్రేట్ ఉన్న నీటిని తాగే వారి కంటే ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ కణితులను, మూడు రెట్లు ఎక్కువగా కలిగి ఉంటున్నారు. ‘‘ఎక్కువగా నైట్రేట్ తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది’’ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే వాటర్‌లో నైట్రేట్ ప్రొస్టేట్ ఉండటం ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుందని చెప్పేందుకు ఇది మొదటి అధ్యయనం మాత్రమే. లోతైన విషయాలు తెలియాలంటే మరికొన్ని పరిశోధనలు, అధ్యయనాలు అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రొస్టేట్‌ను నివారించే ఫైబర్స్

నీరు తీసుకోవడమే కాకుండా అధ్యయనంలో పాల్గొన్నవారు జీవితాంతం అనుసరించిన ఆహారం గురించి కూడా పరిశోధకులు సమాచారాన్ని సేకరించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తినేవారు నైట్రేట్‌తో కలుషితమైన నీటిని తాగినప్పటికీ ఎటువంటి అనారోగ్య ప్రతికూలతలను ఎదుర్కోవడం లేదు. ఎందుకంటే విటమిన్ సి యాంటీ ట్యూమర్ చర్యను ప్రోత్సహిస్తుంది.

ఫైబర్ జీర్ణవ్యవస్థలో విష రసాయనాల చర్యను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు. పండ్లలో, కూరగాయలు నైట్రోసమైన్ చర్యను నిరోధిస్తాయి. ఏది ఏమైనప్పటికీ నైట్రేట్‌లు మానవ శరీరంలో నైట్రోసమైన్‌ల వంటి విషపూరిత, క్యాన్సర్ కారకాలకు దారితీస్తాయి. ఈ విషపూరిత పదార్థాలు ప్రధానంగా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి కలుషితమైన నీటికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అధ్యయనాలు నైట్రేట్, క్యాన్సర్, ఆహారం మధ్య ఉన్న లింకులపై మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read..

Wedding Season: మల్లెపూలకు పెరిగిన డిమాండ్ .. కొండెక్కిన ధరలు




Next Story